మంగళవారం, మార్చి 18, 2025

ఘంటసాల, సుశీల ప్రేమించుకున్నారా?


''ఘంటసాల, సుశీల ప్రేమించుకున్నారంట!'' అన్నాడు మా వాడు.

''అవునా?'' ఆశ్చర్యంగా అడిగాను నేను. 

''అవును... వాళ్లిద్దరి డ్యూయెట్లు ఎన్ని లేవు?'' అంటూ సాక్ష్యం కూడా చూపించాడు వాడు. 

ఇలాంటి కబుర్లు చెప్పే వాడు నా దృష్టిలో ఓ హీరో. నాకే కాదు నాతోటి కుర్రగ్యాంగ్‌కి కూడా. 

''అరే... ఈడికి చాలా తెలుసురా!'' అనుకునేవాళ్లం మేం అప్పట్లో.

అప్పట్లో... అంటే ఎప్పట్లో తెలుసా?

ఓ అయిదు దశాబ్దాల క్రితం అన్నమాట. 

ఆ అప్పట్లో నేను రెండో తరగతి. వాడు మహా అయితే మూడో, నాలుగో తరగతి. మా కుర్రగాళ్ల బ్యాచ్‌కి వాడే లీడర్‌. 

కుతుకులూరులో హైస్కూలు ఎదురుగా ఉండే చెరువు మెట్ల మీదో, స్కూలు లేనప్పుడు ఖాళీగా ఉండే బెంచీల మీదో కూర్చుని వాడిలాంటి కోతలు చాలా కోసేవాడు. 

వాడు చెప్పేదేదైనా నమ్మేయడమే. వాడూ అంత నమ్మకంగానే చెప్పేవాడు మరి.

సినిమా పాటలు వింటే మాకు ఆ నమ్మకం మరింత బలపడిపోయింది.

మరి అప్పట్లో అన్ని డ్యూయెట్లూ వాళ్లవేగా! ఏ పాట విన్నా మా వాడి మాటలే గుర్తొచ్చేవి. 

'నిజమే... లేకపోతే అంత బాగా ఎలా పాడతారు?'అనుకునేవాళ్లం.

ఎంత అమాయకత్వం? ఎంత తెలియనితనం?

రేడియోలు, సినిమాలు తప్ప టీవీలు కానీ, సెల్‌ఫోన్లు కానీ మరే ఇతర వ్యాపకాలు కానీ లేని ఆ రోజుల్లో ఎవరి కబుర్లు వారివి! ఎవరి ఊహలు వారివి!

నా మటుకు నాకు మావాడి మాటలు నిజమేననిపించాక... మరి అంత మంచి వార్త ఎవరికైనా చెప్పకపోతే ఎలా? కడుపు నెప్పి రాదూ?

అందుకే తిన్నగా మా నాన్నగారి దగ్గరకి వెళ్లాను. 

''నాన్నగారూ! మీకో సంగతి తెలుసా? ఘంటసాల, సుశీల ప్రేమించుకుంటున్నారంట...'' అన్నానో సెలవురోజు.

ఆయన కాస్త కోపంగా మొహం పెట్టి, ''ఏడిశావ్‌... అలా మాట్లాడకూడదు...'' అన్నారు. 

''నిజమేటండీ... వాళ్లు పెళ్లి కూడా చేసుకుంటార్ట...'' అంటూ రెట్టించి మరింత మసాలా దట్టించాను నా వార్తకి!

ఈసారి ఆయన నవ్వేశారు. ''ఎవడు చెప్పాడు?'' అన్నారు. 

ఆ తర్వాత కూర్చోబెట్టి సినిమాల గురించి, వాటి చిత్రీకరణ గురించి వివరించారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు కూడా నిజంగా ప్రేమించకోరనీ, అలా నటిస్తారని, వాళ్లందరికీ ఎవరి సంసారాలు వాళ్లకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్లేబ్యాక్‌ గురించి, పాటల రికార్డింగు, వాటిని పాడే గాయకుల గురించి చెప్పారు. 

ఇన్నేళ్ల తర్వాత అప్పటి ఆ జ్ఞాపకాలని తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, ఆ వయసులో ఆ నాటి ఎదిగీఎదగని మనసుకి అవే పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు మరి! 

శుక్రవారం, ఫిబ్రవరి 28, 2025

పాత్రికేయుడి మాటలతో ప్రాణం పోసుకున్న 'దాసి'


తెలంగాణ  గడీలలో దొరలు, దొరసానుల చెప్పుచేతల్లో  బతికే స్త్రీల విషాదగాథలకు నిలువుటద్డం బి. నరసింగరావు  తీసిన  'దాసి' (1988) చిత్రం.  అప్పటికే  'మా భూమి' (1980), 'రంగుల కల' (1984) చిత్రాల ద్వారా తనకంటూ ఒక శైలిని, తెలుగు చిత్రాలకు జాతీయ స్థాయి గౌరవాన్నీ సంపాదించిన నేపథ్యంలో నర్సింగరావు నిర్మించిన 'దాసి' తెలుగు వారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళింది.  ఒక పాత్రికేయుడు  ఆయనతో జరిపిన ముఖాముఖీ, 'దాసి' కథకు  పునాదులు వేసిందట.  ఆ పాత్రికేయుడు గతంలో   పాలమూరు ప్రాంతం లోని ఓ సంస్థానానికి వెళ్ళినప్పుడు ఓ అందమైన అమ్మాయి వచ్చి ఆయన  కాళ్ళు కడగబోయింది.  అందుకు ఆయన  తిరస్కరించగా  ఆ మహిళ ఆశ్చర్యబోతూ అన్న మాటల్ని పాత్రికేయుడి నోటి ద్వారా విన్న నరసింగరావు తీవ్రంగా ఆలోచించారు. ఆ ఆలోచనలు  ఓ అద్భుతమైన సృజనకు బీజాలు వేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రతిభావంతుల ప్రశంసలను అందుకునే దిశగా ఆయనను నడిపించాయి. దొరల గడీలలో  దాసీల ఉదంతాల్ని తన తల్లి గారిని అడిగి తెలుసుకోడంతో పాటు, తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలు పర్యటించి,  కథకు అవసరమైన  1920-40 సంవత్సరాల నాటి నేపథ్య సమాచారాన్ని  విస్తృతంగా సేకరించి, ఓ అద్భుతాన్ని సృష్టించారాయన. ఈ సినిమాలో దాసిగా కామాక్షి పాత్రలో నటి అర్చన నటించింది. ఆమె నటనకు 1989లో జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. 94 నిమిషాల ఈ సినిమా అయిదు జాతీయ అవార్డులు అందుకుంది. ఒక తెలుగు చిత్రానకి ఇన్ని అవార్డులు రావడం అదే తొలిసారి. ఉత్తమ సినిమా, నటి, సినిమటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ డిజైనర్‌, కళా దర్వకత్వాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా 1989లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో డిప్లొమా ఆఫ్‌ మెరిట్‌ అవార్డును కూడా గెలుచుకుంది. అప్పట్లో న్యూయార్క్‌ టైమ్స్‌ లాంటి పత్రికల్లో దాసి గురించి మంచి రివ్యూలు వెలువడ్డాయి. 


ఆదివారం, ఫిబ్రవరి 09, 2025

మరుగుజ్జులుగా మారిన అప్సరసలు! (పిల్లల కోసం రాముడి కథ-12)

మారీచుడు, సుబాహుడు మొదలైన రాక్షసుల్ని చంపి సిద్ధాశ్రమంలో యాగాన్ని సంరక్షించిన రామ లక్ష్మణులు, ఆ మర్నాడు విశ్వామిత్రుడి సూచనపై అతడి వెంట మిథిలా నగరానికి బయల్దేరారు. ఆ సాయంత్రానికి శోణ నదీ తీరానికి చేరుకున్నాక, ఆ ప్రదేశం ఎవరిదని రాముడు కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు విశ్వామిత్రుడు ఆ కథతో పాటు, తన వంశానికి సంబంధించిన వివరాలను కూడా చెప్పుకొచ్చాడు.

''రామా! పూర్వం బ్రహ్మ మనసు నుంచి పుట్టిన కుశుడనే మహా తపస్వి ఉండేవాడు. ఆయనే మా వంశానికి మూల పురుషుడు'' అంటూ మొదలు పెట్టి ఇలా చెప్పాడు.

''బ్రహ్మ మానస పుత్రుడైన కుశుడు, వైదర్భి అనే రాకుమారిని పెళ్లి చేసుకుని నలుగురు కుమారులను కన్నాడు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు. ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో తన కుమారులతో భూమిని పంచుకుని న్యాయంగా ప్రజలను పరిపాలించమని ఆదేశించాడు. అప్పుడు ఆ నలుగురు కుమారులూ నాలుగు నగరాలను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు. కుశాంబుడు కౌశాంబీ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. కుశనాభుడు మహోదయమనే మహానగరాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఆధూర్తరజసుడు ధర్మారణ్యమనే పురాన్ని కట్టుకున్నాడు. వసువు అనేవాడు గిరివ్రజమనే నగరాన్ని నిర్మించుకున్నాడు. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం ఆ గిరివ్రజంలోదే. ఈ దేశం చుట్టూ అయిదు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలో పుట్టిన శోణానది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ ఈ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తోంది'' అంటూ వివరించాడు.

ఆపై ఆయన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పసాగాడు.

''రామా! కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడొకడు ఉన్నాడని చెప్పాను కదా! ఆయన భార్య ఘృతాచి అనే అప్సరస. వీళ్లకి వంద మంది అందమైన ఆడపిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకసారి ఆ నూరుమంది కన్యలూ చక్కగా అలంకరించుకుని వన విహారానికి వెళ్లారు. ఆట పాటలతో ఆనందిస్తున్న వారిని చూసిన వాయుదేవుడు మోహించాడు. ఆయన వారి ముందుకు వచ్చి, ''మీరందరూ నన్ను పెళ్లి చేసుకోండి. మీరందర్నీ ముసలితనమూ, చావూ లేని దేవతలుగా మారుస్తాను'' అంటూ బలవంతపెట్టాడు. 

అందుకు ఆ కన్యలందరూ ముక్తకంఠంతో తిరస్కరించారు. ''అన్ని జీవులలోనూ ప్రాణ రూపంలో ఉండే నీ ప్రభావం గురించి మాకు తెలుసు.  నువ్వెందుకు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నావు? మేం కుశనాభుడి కుమార్తెలం. మా త్రండి ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటాం. నువ్వు దేవుడవే అయినా దుర్భిద్ధి చూపుతున్నావు. మేం తల్చుకుంటే నీ దివ్యశక్తులను కూడా తీసివేయగలం. కానీ మా తపశ్శక్తి తగ్గిపోతుందని అలా చేయడం లేదు'' అంటూ కచ్చితంగా చెప్పేశారు. 

వాళ్ల మాటలు విన్న వాయుదేవుడు కోపించి వారిని మరుగుజ్జులుగా మార్చేశాడు. వాళ్లంతా ఏడుస్తూ తమ తండ్రి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. 

అంతా విన్న కుశనాభుడు ''కుమార్తెలారా! మీరందరూ ఒకే మాటపై నిలబడి మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. మీరు ఆ వాయుదేవుడిని క్షమించి వదిలి పెట్టడం మరింత గొప్ప విషయం. దాన యజ్ఙాల వల్ల కలిగే గొప్ప ఫలాలన్నీ కూడా, క్షమా గుణం వల్ల లభిస్తాయి. మీ అంతటి క్షమను కలిగి ఉండడం దేవతలకు కూడా సాధ్యం కాదు'' అంటూ ప్రశంసించి, ఆపై జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచన చేశాడు. తన కుమార్తెలకు పెళ్లి చేయాలని నిర్ణయించి తగిన వరుడి కోసం మంత్రులతో చర్చించాడు.

ఆ కాలంలోనే చూళి అనే మహాముని ఉండేవాడు. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేసుకుంటున్న సమయంలో సోమద అనే ఓ గంధర్వ కన్య ఆయనకు సపర్యలు చేసేది. ఆమె సేవలకు సంతోషించిన చూళి మహాముని ఒక రోజు, ''నీకేం వరం కావాలో కోరుకో'' అని అడిగాడు. అందుకామె వినయంగా నమస్కరించి, ''స్వామీ! నేను ఎవరికీ భార్యను కాను. పవిత్రురాలను. మీ బ్రహ్మతేజస్సు ప్రభావంతో ఒక పుత్రుడిని ప్రసాదించండి'' అని కోరుకుంది. అప్పుడాయన తన మనస్సు నుంచి బ్రహ్మదత్తుడనే కుమారుడిని అనుగ్రహించాడు. ఆ బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. కుశనాభుడు ఆ బ్రహ్మదత్తుడిని ఆహ్వానించి తన కుమార్తెలతో పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడు ఆ నూరుగురు అమ్మాయిల చేతులను వరసగా తాకగానే, వారికి ఉన్న వాయు దోషము తీరిపోయి, తిరిగి చక్కని అందగత్తెలుగా మారిపోయారు'' 

ఈ కథంతా చెప్పిన విశ్వామిత్రుడు తన పుట్టుక గురించి కూడా చెప్పాడు.

''రామా! ఆ కుశనాభుడు తన వంద మంది కుమార్తెలకు వివాహం చేశాక, పుత్రుడి కోసం పుత్రకామేష్ఠి యాగాన్ని ఆచరించాడు. ఫలితంగా ఆయనకు గాధి అనే కుమారుడు కలిగాడు. ఆ గాధియే నా తండ్రి. నేను కుశ వంశంలో పుట్టాను కాబట్టి నాకు కౌశికుడు అనే పేరు కూడా ఏర్పడింది. గాధి మహారాజుకు నాతో పాటు సత్యవతి అనే కుమార్తె కలిగింది. కుశ వంశంలోనే పుట్టింది కాబట్టి ఆమెకు కౌశికి అనే పేరు కూడా ఉంది. ఆమె మహా పతివ్రత. శరీరంతో స్వర్గానికి చేరింది. ఆమే కౌశికి అనే పేరుతో హిమాలయాల్లో నదిగా మరి భూతలంలో ప్రవహిస్తోంది. ఆమె మీద మమకారంతోనే నేను హిమాలయాల్లో ఉంటాను. సిద్ధాశ్రమానికి యాగం కోసమే వచ్చాను. నీ పరాక్రమం వల్ల యాగం చక్కగా పూర్తయింది'' అంటూ విరమించాడు. 

ఆ రాత్రి వారందరూ శోణ నదీ తీరంలో విశ్రమించారు. అయోధ్య నుంచి బయల్దేరిన రామలక్ష్మణులకు ఇది పదకొండవ రోజు. మరుసటి రోజు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

శనివారం, ఫిబ్రవరి 08, 2025

ఎగిరిపోయిన మారీచుడు! నేలకొరిగిన సుబాహుడు!! (పిల్లల కోసం రాముడి కథ-11)


 

ఎగిరిపోయిన మారీచుడు! నేలకొరిగిన సుబాహుడు!! (పిల్లల కోసం రాముడి కథ-11)


అయోధ్య నుంచి విశ్వామిత్రుడితో కలిసి బయల్దేరిన రామలక్ష్మణులు, నాలుగో రోజు రాత్రికి సిద్ధాశ్రమం చేరి అక్కడ విశ్రమించారు. మర్నాడు తెల్లవారుతూనే వాళ్లు స్నాన సంధ్యాదికాలు ముగించి, సర్వసన్నద్ధులై మునులందరి మధ్య ఉన్న విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి  నమస్కరించారు.

''మునీశ్వరా! యాగ సంరక్షణకు మేం సిద్ధంగా ఉన్నాం. రాక్షసులు ఎప్పుడు వస్తారో తెలియజేయండి'' అని వినయంగా అడిగారు.

ఆ మాటలు విని అక్కడ ఉన్న మునులందరూ ఎంతో సంతోషించి, ''నాయనలారా! నేటి నుంచి విశ్వామిత్ర మహర్షి ఆరు రోజుల పాటు మౌన దీక్షలో ఉంటారు. యాగం జరిగే ఈ కాలమంతా మీరు అప్రమత్తులై ఉండి యాగ రక్షణ చేయండి'' అన్నారు.

అప్పటి నుంచి రామలక్ష్మణులు ఆ సమీపంలోనే తిరుగుతూ ధనుర్బాణాలు ధరించి సిద్ధంగా ఉన్నారు. అయిదు రోజుల పాటు యాగం నిరాటంకంగా జరిగింది. ఆరో రోజు వేద మంత్రాల మధ్య యాగం సాగుతుండగా, ఆకాశం నుంచి ఒక భీకరమైన శబ్దం వినిపించింది. వర్షాకాలంలో కమ్ముకొచ్చే మేఘాల మాదిరిగా రాక్షసులు వడివడిగా అక్కడికి వచ్చారు. భయంకరులైన మారీచుడు, సుబాహుడు అనుచరులతో కూడి రాక్షస మాయలు ప్రయోగిస్తూ, ఆ యాగ ప్రదేశమంతా రక్త వర్షం కురిపించసాగారు. అది చూసిన రాముడు వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి లక్ష్మణుడితో, ''లక్ష్మణా! దుర్మార్గులైన ఈ రాక్షసులపైకి మానవాస్త్రాన్ని సంధిస్తున్నాను చూడు! ఇది పెనుగాలి మేఘాలను తరిమినట్లు వీళ్లను చెల్లాచెదరు చేస్తుంది'' అంటూ వెలుగులు చిమ్ముతున్న ఆ బాణాన్ని మారీచుడి గుండెలకు గురి చూసి వదిలాడు. ఆ దెబ్బకు మారీచుడు స్పృహ కోల్పోయి గాలిలో గిరగిరా తిరుగుతూ నూరు యోజనాల దూరం ఎగిరిపోయి ఎక్కడో సముద్రంలో పడిపోయాడు. ఆ తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహువు పైకి వదిలాడు. దాని ధాటికి వాడు నేల కూలి మరణించాడు. అదే వేగంతో రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి మిగిలిన రాక్షసులందరినీ కూడా తుద ముట్టించాడు.

యాగం పరిసమాప్తమయింది. మునులందరూ రామలక్ష్మణులను ఎంతగానో ప్రశంసించి పూజించారు.

విశ్వామిత్రుడు పరమానంద భరితుడై, ''రామా! నీ వల్ల యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. నువ్వు నీ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టకున్నావు. ఈ సిద్ధాశ్రమం పేరు నిలబెట్టావు'' అంటూ మెచ్చుకున్నాడు.

ఆ రాత్రి ఆ ఆశ్రమంలో అందరూ నిశ్చింతగా నిద్రపోయారు. తెల్లవారుతూనే  రామలక్ష్మణులు శుచులై, విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, ''మునీశ్వరా! మేము నీ సేవకులం. ఇంకా మేమేం చేయాలో ఆనతియ్యండి'' అని మృదు మధురంగా పలికారు.

విశ్వామిత్రుడితో సహా అక్కడి మునులందరూ కలసి, ''ఓ రామా! మిథిలా నగరానికి రాజయిన జనకుడు ఒక యాగాన్ని చేయబోతున్నాడు. మనమందరం అక్కడికి వెళ్దాం. మీరిద్దరూ కూడా రండి. అక్కడొక అద్భుతమైన ధనుస్సు ఉంది. సాటిలేని శక్తిగల ఆ ధనువు శత్రువులకు భయంకరమైనది. దాన్ని ఎక్కుపెట్టడానికి గంధర్వులు, అసురులు, రాక్షసులు, దేవతలు సైతం సరిపోరు. దాని శక్తిని తెలుసుకోడానికి  ఎందరో రాజులు, రాకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు.'' అంటూ వివరించారు.

ఆ ధనువే శివధనుస్సుగా పేరు పొందింది. పూర్వం శివుడి భార్య సతీదేవి, తన తండ్రి దక్షుడు తలపెట్టిన యజ్క్షానికి ఆహ్వానించకపోయినా వెళ్లి, అవమాన పడి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు, ఈ ధనువునే ఉపయోగించి శివుడు ఆ యాగాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఆయన దాన్ని దేవతలకు ఇచ్చివేశాడు. మిథిలా నగరానికి ఒకప్పటి రాజైన దేవరాతుడు ఒక యాగం చేసినప్పుడు దేవతలు ఈ ధనుస్సును  

ఆయనకు బహూకరించారు. అప్పటి నుంచి అది ఆ వంశీయులచే పూజలందుకుంటూ ఉంది.

విశ్వామిత్రుడు చెప్పిన మీదట రామలక్ష్మణులు వారందరితో కలిసి మిథిలకు బయల్దేరారు. యాగ సంరంభాలతో కూడిన వంద వాహనాలతో కలిసి వారంతా కదిలారు. విశ్వామిత్రుడు అక్కడి వనదేవతలకు నమస్కరించి వీడ్కోలు తీసుకుని నడవసాగాడు. ఆ ఆశ్రమంలోని జంతువులు, పక్షులు కూడా వారి వెంట సాగుతుండగా, కొంత దూరం తర్వాత విశ్వామిత్రుడు ప్రేమతో వాటిని వారించి వెనుకకు పంపేశాడు. ఆ రోజంతా ఉత్తర దిశగా ప్రయాణించి వాళ్లందరూ సూర్యుడు అస్తమించే వేళకి శోణ నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నదిలో స్నానసంధ్యాదికాలు పూర్తి చేశాక విశ్వామిత్రుడితో రాముడు ''మహాత్మా! దట్టమైన వృక్షాలతో ఉన్న ఈ ప్రదేశం ఎవరిది?'' అంటూ కుతూహలంగా ప్రశ్నించాడు.  అందుకు విశ్వామిత్రుడు ఆ ప్రదేశానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చెప్పాడు.

ఆ కథేంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!